గనుల శాఖపైన సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన మంత్రి కెటి రామారావు

16Mar 2018

గనుల శాఖపైన సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన మంత్రి కెటి రామారావు

– గత ఎడాదిలో కార్యకలాపాలు నిర్వహించని 477 లీజుల రద్దు
– గనుల శాఖలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలన్న మంత్రి
– పర్యావరణ సమతుల్యత కోసం రాక్ సాండ్ వినియోగాన్ని పెంచాలి
– ప్రభుత్వం చేపట్టిన సాగునీటి, అర్ అండ్ బి శాఖల నిర్మాణాల్లో దీని వినియోగాన్ని పెంచడం కోసం ఆయా శాఖల ఇంజనీరింగ్ శాఖాధిపతులతో సమావేశం
– టిఎస్ఎండిసి సైతం రాక్ సాండ్ క్రషర్ల ఏర్పాటును పరిశీలించాలి
– బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు పైన త్వరలోనే కేంద్ర గనుల శాఖ, స్టీల్ శాఖ మంత్రులను కలువనున్న మంత్రి
– ఈ ఆర్ధిక సంవత్సరంలో లక్ష్యాన్ని మించిన గనుల శాఖ ఆదాయం

ఈ రోజు గనుల శాఖపైన సుదీర్ఘ సమీక్ష సమావేశాన్ని గనుల శాఖ మంత్రి కెటి రామారావు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ అక్రమ మైనింగ్ జరిగినా క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. అక్రమ మైనింగ్‌ను సహించేది లేదని, ఏంతటి వారైనా ఒత్తిడికి గురికావద్దని మంత్రి అధికారులకు తెలిపారు. గత సంవత్సర కాలంలో గనుల శాఖలో అనేక కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు మంత్రికి అధికారులు తెలియజేశారు. వరంగల్ , హైదరాబాద్, నిజామాబాద్ ప్రాంతీయ కార్యాలయాల పరిధిలో 354 తనీఖీలు నిర్వహించామని, 79 ఉల్లంఘనలు గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. దీంతో పాటు రాష్ట్రంలో గనులు లీజు తీసుకుని కార్యకలాపాలు నిర్వహించని 477 లీజులను రద్దు చేశామన్నారు.

గనుల శాఖలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలన్నారు. ముఖ్యంగా గనుల పర్యవేక్షణలో జియోఫెన్సింగ్, జీయో ట్యాగింగ్, ఉపగ్రహా చిత్రాల ఉపయోగం, డ్రోన్ల వినియోగాన్ని ఉపయోగించుకోవాలన్నారు. త్వరలో తీసుకురానున్న మైనింగ్ పాలసీలో దేశంలోని అత్యుత్తమ విధానాలను చేకూర్చాలన్నారు. ఈ పాలసీని చట్టరూపంలో తీసుకువస్తామన్నారు. ఈ ఆక్షన్ ( E-auction) ద్వారానే గనుల, ఇసుక రీచుల లీజులు జరగాలని, ఇందుకోసం అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని సున్నపు రాయి గనుల లీజుపైన మంత్రి చర్చించారు. భవిష్యత్తులో వచ్చే ఈ గనుల లీజులకు జాతీయ స్ధాయి వేలం స్ధానంలో అంతర్జాతీయ స్ధాయి వేలం నిర్వహించాలన్నారు.

పర్యావరణ సమతుల్యత కోసం రాక్ సాండ్ వినియోగాన్ని పెంచాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన సాగునీటి, అర్ అండ్ బి శాఖల నిర్మాణాల్లో దీని వినియోగం పెంచడం కోసం ఆయా శాఖల ఇంజనీరింగ్ శాఖాధిపతులతో సమావేశం ఎర్పాటు చేయాలన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరతామన్నారు. టిఎస్ఎండిసి సైతం రాక్ సాండ్ క్రషర్ల ఏర్పాటును పరిశీలించాలని ఆదేశించారు. పలు జిల్లాల్లో చేపట్టిన సాండ్ టాక్సీ విధానం విజయవంతమైన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేసేందుకు సిద్దంగా ఉండాలన్నారు. ఒక్క ఫోన్ కాల్ తో రాష్ట్రంలో ఎవరికైనా ఇసుక ఏ ధరతో లభిస్తుందో తెలిసేలా విధానం ఉండాలన్నారు.
ఈ ఆర్ధిక సంవత్సరానికిగాను గనుల శాఖ ఆదాయం లక్ష్యాన్ని సాధించినట్లు మంత్రి తెలిపారు. ఈ సంవత్సరానికి గాను నిర్ధేశిత 3166 కోట్ల రూపాయాల లక్ష్యానికి గాను మేజర్, మైనర్ మినరల్స్ ద్వారా ఫిబ్రవరీ నెలాఖరుకు సూమారు మూడు వేల 500 వందల కోట్ల రూపాయాల(110శాతం) ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ముఖ్యంగా ఇసుక ఆధాయ లక్ష్యం 388 కోట్లకు గాను 538 కోట్ల ఆదాయం (139శాతం) ఖజానాకు లభించినట్లు తెలిపారు. తమ ప్రభుత్వం ఎర్పడిన తర్వాత అక్రమ ఇసుక తవ్వకాలపై ఉక్కపాదం మోపడంతో ఇంత పెద్ద ఎత్తున ప్రజల సంపద ప్రభుత్వానికి చేరిందన్నారు. ఖనిజాల ఆధాయం ప్రజల ఆస్తి అని, అది వారి అభివృద్దికే ఉపయోగపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. అందుకే మైనింగ్ ఆదాయంలోని లీకేజీలను సాద్యమైనంత ఎక్కవగా అరికట్టామని తెలిపారు.

బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు పైన మంత్రి సమావేశంలో అధికారులతో చర్చించారు. సమావేశానికి హజరైన ఎన్ఎండిసి డైరెక్టర్ మరియు ప్రతినిధులతో ఇనుప ఖనిజం కేటాయింపులపై చర్చించారు. ఇప్పటికే పలుసార్లు కేంద్రాన్ని కోరినా బయ్యారంపైన ఏలాంటి నిర్ణయం తీసుకోవడంలేదన్నారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు పైన త్వరలోనే కేంద్ర గనుల శాఖ, స్టీల్ శాఖ మంత్రులను కలుస్తామన్నారు. గనుల శాఖ డైరెక్టర్ సుశీల్ కూమార్, టిఎస్ఎండిసి యండి మల్సూర్, గనుల శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గోన్నారు.