హ్యాండ్లూమ్స్ మరియు టెక్స్్టైల్స్ శాఖపైన మంత్రి కేటి రామారావు సమీక్షా సమావేశం….

12Sep 2017

హ్యాండ్లూమ్స్ మరియు టెక్స్్టైల్స్ శాఖపైన మంత్రి కేటి రామారావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని, శాఖ చేపట్టిన పలు కార్యక్రమాల మీద మంత్రి సమీక్షించారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో టెక్స్్టైల్స్ శాఖాధికారులు పాల్గొన్నారు. ఈ నెల 16 నాటికి అన్ని చీరలు జిల్లా కేంద్రాలకు చేరుతాయని అధికారులు మంత్రికి తెలియజేశారు. సెప్టెంబర్ 17,18,19 తేదీల్లో చీరల పంపిణీ కార్యక్రమం పూర్తవుతుందన్నారు. ఈ సంద్రభంగా మంత్రి మాట్లాడుతూ బతుకమ్మ చీరల కార్యక్రమం ద్వారా ఒక వైపు నేతన్నలకు ఉపాధితోపాటు, పండగ సందర్భంగా ఆడపడుచులకు సంతోషం పంచినట్టు అవుతుందన్నారు. ఈ చీరల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేయాలన్నారు.
ప్రభుత్వం టెక్స్్టైల్ శాఖకు గతంలో ఎన్నడు లేనంత సహకారం ఇస్తుందని తెలిపారు. ఈసారి పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయింపులతో పాటు పక్కా ప్రణాళికలతో పలు కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. నేతన్నల కోసం పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని, ముఖ్యంగా కార్మికుల వ్యక్తిగత రుణాల మాఫీతోపాటు, నేతన్నకు చేయూత, యార్న్ సబ్సీడీ వంటి కార్యక్రమాలను ఉదహరించారు. ఇకపైన రాష్ట్ర ప్రభుత్వం సేకరించే ప్రతి మీటర్ బట్ట తెలంగాణ నుంచే సేకరిస్తామన్నారు. ఈ సారి కేవలం రెండు నెలల వ్యవధిలో కోటి ఆరు లక్షల ఆడపడుచులకు చీరలను అందిస్తున్నమన్నారు. రాష్ట్రంలోని నేతన్నల పూర్తి ఉత్పాదక సామర్ధ్యాన్ని పూర్తిగా వినియోగించుకునేందుకు వార్షిక ప్రణాళికను త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వు రూపంలో ఇస్తామన్నారు. దీంతో వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోని నేతన్నలకు కనీసం సంవత్సరానికి 8 నెలల పాటు ప్రభుత్వం సేకరించే వస్ర్తాల ఉత్పత్తి పైన పనిచేసే అవకాశం వస్తుందన్నారు. ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న అర్డర్లతో నెలకు కనీసం 15 వేల రూపాయల వేతనం మూడు నెలలపాటు లభించిందన్నారు. రంజాన్, క్రిష్టమస్, బతుకమ్మకు చీరలు, రాజీవ్ విద్యామిషన్ వస్ర్తాల సేకరణను వ్యవస్ధీకృతం చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది నుంచి పక్కా ప్రణాళిక ప్రకారం ఈ వస్ర్తాల సేకరణ జరపాలన్నారు. వచ్చే ఏడాది నుంచి ఇందుకోసం అడ్వాన్స్ ప్లానింగ్ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వంలో వస్ర్తాలను సేకరిస్తున్న విద్యా శాఖ, స్ర్తీ శిశు సంక్షేమ శాఖ, వైద్యారోగ్య శాఖల శాఖాధిపతులతో కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. నేతన్నల కోసం చేపట్టిన కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని, నేతన్నకు చేయూత కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాల్లో సమావేశాలు వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే చేనేత మగ్గాలు, కార్మికుల సంపూర్ణ సమాచారం ఉన్నదని, దీంతోపాటు పవర్ లూమ్ కార్మికుల సమాచార సేకరణను అధికారులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రతి వీవర్ లెక్క టెక్స్‌టైల్ శాఖ వద్ద ఉండాలని, ప్రతి పవర్లూమ్, చేనేత కార్మికుల సమాచారాన్ని డిజిటైజ్ చేయాలన్నారు. టెక్స్ టైల్ శాఖ చేపట్టనున్న యార్న్ సబ్సీడీ, రసాయనాలు, అద్దకాలు సబ్సిడీ వంటి కార్యక్రమాలు వెంటనే ప్రారంభం కావాలని అధికారులను మంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు. రాష్ర్టానికి వివిధ పథకాల కింద రావాల్సిన కేంద్ర ప్రభుత్వ సహకారం కోసం డిల్లీలో ప్రత్యేక శ్రధ్ద వహించాలన్నారు. తాము ఇప్పటికే కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీని కలిసి ఈ మేరకు సహకారం కోరామన్నారు. డిమాండ్ ఉన్న జిల్లా కేంద్రాల్లో టెస్కో షోరూంలను ఏర్పాటు చేస్తామన్నారు. డిల్లీలోని తెలంగాణ భవన్ లోనూ వెంటనే టెస్కో షోరూం ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇకపైన కేంద్రమంత్రులను కలిసే సందర్భంలో తెలంగాణ చేనేత వస్ర్తాలు, గోల్కొండ కళాకృతులను అందించాలని, ఈమేరకు డిల్లీలోని తెలంగాణ భవన్ లో ప్రత్యేక ఏర్పాట్లు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు.