ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. క్రైస్తవ మిషనరీలు కొన్ని దశాబ్దాలుగా విద్య, వైద్య రంగంలో ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు. ఎక్కడ విపత్తులు సంభవించినా సేవలు అందించడానికి క్రైస్తవ సమాజం ముందు ఉంటుందన్నారు. విపత్తుల వేళ కూడా విశేష సేవా, సహాయం అందిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ హిందూ ధర్మాన్ని బలంగా నమ్ముతారు. అదే సమయంలో ఇతరుల నమ్మకాలను కూడా గౌరవిస్తారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. స్వరాష్ట్రంలో పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చెందాయన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థుల కోసం 940 గురుకులాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ గురుకులాల్లో 5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒక్కో విద్యార్థిపై రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. క్రైస్తవ సమాజానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.