హైదరాబాద్ నగరంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బస్తీ దవాఖానలు విజయవంతంగా కొనసాగుతున్నట్లు పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ అన్నారు.

28Aug 2020

ప్రజారోగ్యాన్ని కాపాడడంలో బస్తీ దవాఖానలు విజయవంతం

-బస్తీ దవాఖానలపై సమీక్ష
-పేద ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలు అందడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం
-బస్తీ దవాఖానల ద్వారా ప్రతి రోజు 25 వేల మందికి ఓపి వైద్య సేవలు
-హైదరాబాద్ పరిధిలోని 197 బస్తీ దవాఖానలు, ఇతర నగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రతి రోజు 5000 పరీక్షలు
-బస్తీ దవాఖానలకు పేదల నుంచి మంచి స్పందన వస్తుంది
-ఈ నేపథ్యంలో మరో వంద బస్తీ దవాఖానల ఏర్పాటు త్వరగా పూర్తి చేయాలని ఆదేశం

– మంత్రి శ్రీ కేటీఆర్

హైదరాబాద్ నగరంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బస్తీ దవాఖానలు విజయవంతంగా కొనసాగుతున్నట్లు పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ అన్నారు. తొలిదశలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన బస్తీ దవాఖానలను, తర్వాత కాలంలో పెద్ద ఎత్తున ప్రభుత్వం విస్తరించిందని, ఈ బస్తీ దవాఖానలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసి పరిధిలో 197 బస్తీ దవాఖానలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని మంత్రి తెలిపారు. హైదరాబాద్ నగరంలోని పేదలుండే చోటనే, పలు బస్తీలలో ఏర్పాటుచేసిన బస్తీ దవాఖానల ద్వారా స్థానికంగా ఉన్న పేద ప్రజలకు వైద్య ఆరోగ్యానికి సంబంధించిన ప్రాథమిక సేవలను ఉచితంగా అందుతున్నాయని, ఇలా వైద్య సేవలే తమ ప్రాంతానికి రావడంతో వాటిని ప్రజలు పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న బస్తీ దవాఖానల మెత్తం సంఖ్యను 300లకు పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తాము పని చేస్తున్నామని, త్వరలోనే దశలవారీగా ప్రస్తుతం ఉన్న 197 సంఖ్యను 300కు పెంచుతామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. బస్తీ దవాఖానలకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ వాకాటి కరుణ, జిల్లాల కలెక్టర్లు, మరియు పురపాలక శాఖ, జీహెచ్ఎంసి ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పేద ప్రజలు ఉన్న ప్రతి డివిజన్ లోనూ బస్తీ దవాఖాన ఉండాలన్నదే తమ లక్ష్యమని, అవసరమైన చోట్ల రెండు లేదా అంతకు మించి కూడా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బస్తీ దవాఖానలతోపాటు నగరంలో ఉన్న 130కి పైగా అర్బన్ పి హెచ్ సి లతో కలిపి ప్రజలకు ప్రాథమిక వైద్య ఆరోగ్య సేవలు అందిస్తున్నాయని, వీటితోపాటు వైద్యపరీక్షలు సైతం కొనసాగుతున్నాయని మంత్రి అన్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని బస్తి దవాఖానలన్నీ ఇప్పటికే ఆన్లైన్ లోకి వచ్చాయని మిగిలిన వాటిని కూడా ఆన్లైన్ చేసి ఎప్పటికప్పుడు వాటి ద్వారా అందుతున్న వైద్యసేవలు సమీక్షిస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. పేద ప్రజలకి ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించడంలో బస్తీ దవాఖాన విజయవంతమైన నేపథ్యంలో జిహెచ్ఎంసి పరిధిలో పెద్ద సంఖ్యలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఉన్న ప్రాంతాల్లో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తామన్నారు. బస్తీ దవాఖానలు మరియు అర్బన్ పి హెచ్ సి ల్లో కేవలం ఓపీ సేవలు మాత్రమే కాకుండా వారికి అవసరమైన టెస్టులు(వైద్య పరీక్షలు) కూడా అందిస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రికి అధికారులు తెలియజేశారు. జిహెచ్ఎంసి పరిధిలో ప్రతిరోజు సుమారు 5,000 టెస్టులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని, వీటి సంఖ్య మరింత పెంచేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. ఈ పరీక్షలు తెలంగాణ డయాగ్నస్టిక్స్ ద్వారా చేస్తున్నామని, పరీక్షల ఫలితాలను కూడా మొబైల్ ఫోన్ ఉన్నవారికి వెంటనే చేరేలా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.ఈ విషయంలో ఇతర ప్రైవేట్ డయాగ్నస్టిక్స్ కి ఏ మాత్రం తీసిపోకుండా, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా తమ ప్రయత్నం కొనసాగుతుందని వైద్య శాఖ అధికారులు మంత్రి కేటీఆర్ గారికి తెలియజేశారు. బస్తీ దవాఖానలో పలుచోట్ల మూత్రశాలలు లేని విషయం తమ దృష్టికి వచ్చిందని, వాటిని వెంటనే ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఈ సందర్భంగా అధికారులు మంత్రి కేటీఆర్ కి తెలియజేశారు. మూత్ర శాలలు కట్టేందుకు స్థలం లేని చోట్ల మొబైల్ టాయిలెట్లను ఉంచుతామని తెలియజేశారు.

Image may contain: outdoor

బస్తీ దవాఖాన ద్వారా పేద ప్రజలకు కావలసినప్పుడు వైద్యసేవలు అందడం పట్ల హర్షం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్ వీటి సేవలను మరింత ప్రభావవంతంగా కొనసాగించేందుకు అవకాశం ఉన్న ప్రతి చోట ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. బస్తీ దవాఖాన పనితీరు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలోనే మరో వంద బస్తీ దవాఖానలు ఒకటి రెండు నెలల్లో ప్రారంభం అయ్యేలా చూడాలని ఈ సందర్భంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.