వచ్చే జూన్ నాటికి నగరంలో లక్ష డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తికానున్నట్లు రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. నగరంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంపై మంత్రి కేటీఆర్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు వచ్చే జూన్ నాటికి నగరంలో లక్ష డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. నగరంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చాలా వేగంగా నడుస్తున్నదని తెలిపారు. ఇండ్ల నిర్మాణంలో స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలను భాగస్వాములను చేయడం ద్వారా పర్యవేక్షణ, నిర్మాణ వేగం మరింత పెరుగుతుందన్నారు. నియోజకవర్గాల వారిగా నిర్మాణం అవుతున్న ఇండ్ల సంఖ్య ప్రాంతాలతో జాబితా తయారు చేసి స్థానిక ఎమ్మెల్యేలకు ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
లబ్దిదారుల ఎంపికపైనా పారదర్శక విధానాన్ని రూపొందించేందుకు కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది, జీహెచ్ఎంసీ, హౌసింగ్బోర్డు అధికారులు చర్చించాలని సూచించారు. ఇందుకుగాను ఆధార్కార్డు, బయోమెట్రిక్, సమగ్ర కుటుంబ సర్వేవంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని లోపరహితంగా ఎంపిక విధానం రూపొందించాలన్నారు. ప్రస్తుతం ఉన్న జేఎన్ఎన్యూఆర్, గృహకల్ప ప్రాజెక్టుల్లో మిగిలిన సుమారు 13 వేల ఇళ్లను లబ్దిదారులకు అందించేందుకు ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. అందుకు అవసరమైన అదనపు నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. వందలు, వేలల్లో ఇళ్ల నిర్మాణాలు చేస్తున్న ప్రాంతాల్లో రోడ్లు, తాగునీటి సరఫరా, పోలీస్ స్టేషన్ల వంటి మౌలిక వసతుల కల్పన రూపకల్పన కోసం వివిధ శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఇళ్ల నిర్మాణం అయ్యేనాటికి ఆయా వసతులు పూర్తి అయ్యేలా చూడాలని మంత్రి పేర్కొన్నారు.