Minister Sri KTR held a review meeting on the status of dignity housing schemes in Hyderabad. Mayor Sri Bonthu Rammohan, Deputy Mayor Sri Baba Fasiuddin, Principal Secretary Arvind Kumar, GHMC Commissioner Lokesh Kumar, Enforcement, Vigilance & Disaster Management Director Viswajit Kampati & concerned districts Collectors participated.
హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాల పై మంత్రి శ్రీ కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నగర్ మేయర్ శ్రీ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ శ్రీ బాబా ఫసియుద్దీన్, ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి మరియు జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు.
ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి హైదరాబాద్ నగరంలో సుమారు 85 వేలకు పైగా ఇళ్లను పేదలకు అందించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ తెలియజేశారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసి పరిధిలో పెద్ద ఎత్తున డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కొనసాగుతున్నదని అన్నారు. సుమారు 9 వేల 700 కోట్ల రూపాయలతో దేశంలో ఏ మెట్రో నగరంలో లేనంత పెద్ద ఎత్తున డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం కోసం ఇంత పెద్ద ఎత్తున దేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం లేదని, ఈ విషయంలో తెలంగాణ ముందు వరుసలో ఉన్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్లతోపాటు, జీహెచ్ఎంసి హౌసింగ్ విభాగం అధికారులు పురపాలక శాఖ ఉన్నతాధికారులతో ఈ సమావేశం జరిగింది. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఇళ్ల నిర్మాణ పనులను ఈ సమావేశంలో సమీక్షించారు. చాలా చోట్ల పనులు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో తాగునీరు, విద్యుత్, ఇతర మౌళిక వసతుల పనులు వేగవంతం చేయాలన్నారు. ఇప్పటికే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం తుది దశకు చేరుకున్నవని మంత్రికి అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో వరుసగా పేదలకు వాటిని అందించే కార్యక్రమం చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులను మంత్రి ఆదేశించారు. ఆగస్టు మాసాంతం నుంచి డిసెంబర్ నెల వరకు పెద్ద ఎత్తున డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని, వాటిని వెంటవెంటనే పేద ప్రజలకు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కూడా ఈ సందర్భంగా తెలిపారు. సుమారు 75 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంతో పాటు మరో పది వేలు జెఎన్ఎన్ యుఆర్ఎం మరియు వాంబే ఇళ్లు ఉన్నట్లు ఈ సందర్భంగా అధికారులు మంత్రికి తెలియజేశారు. ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఇప్పటికీ నియోజకవర్గానికి నాలుగు వేల చొప్పున 24 నియోజకవర్గాలకు లక్ష ఇళ్లు అందించే కార్యక్రమం ఉండబోతుందన్నారు. దీనికి సంబంధించిన లబ్దిదారుల క్యాచ్మెంట్ ఏరియా కూడా రూపొందించినట్లు మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలియజేశారు. ముందుగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం స్థలాల ఇచ్చినటువంటి మురికివాడల్లోని ప్రజల జాబితాను వెంటనే అప్లోడ్ చేయాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసి పరిసర జిల్లాలో నిర్మిస్తున్న ప్రాంతాల్లో సుమారు 10% స్థానిక ప్రజల కోసం కేటాయించిన నేపథ్యంలో ఆయా జిల్లాల నుంచి ఈ మేరకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు మంత్రి కేటీఆర్ సూచించారు. జీహెచ్ఎంసి పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, ఇందులో సింహభాగాన్ని ఈ సంవత్సరం చివరి వరకు ప్రజలకు అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలియజేశారు.