Minister Sri KTR reviewed the progress of various projects undertaken by HMDA.

18Jun 2018

హెచ్ఎండిఏ పైన సుదీర్ఘ సమీక్ష నిర్వహించిన పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు

అవుటర్ రింగ్ రోడ్డు నగరానికి మణిహారం లాంటిదని దీని చుట్టు సాద్యమైనన్ని ఎక్కువ సౌకర్యాలను కల్పించాలని పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు పురపాలక శాఖాధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఇంటర్ చేంజ్ ల వద్ద వే సైడ్ అమెనిటీస్ ( Wayside Amenities) ఎర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే ఇందుకోసం సంస్ధ పలు ఇంటర్ చేంజ్ లను పరిశీలించిందని అధికారులు మంత్రి తెలిపారు. అవుటర్ చుట్టు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున గ్రీనరీ పెంచుతున్నామని తెలిపారు. దీంతోపాటు అవుటర్ పైన ప్రతి పది కీలోమీటర్లకు ఒక అంబులెన్సు ఉండేలా వాటి సంఖ్యను పెంచాలన్నారు. అరోగ్య శాఖతో సమన్వయం చేసుకుని ట్రామ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. అవుటర్ రింగ్ రోడ్డుపైన పూర్తి స్ధాయిలో ఎల్ఈడీ దీపాల ఎర్పాటు చేసే ప్రక్రియను మంత్రి అడిగి తెలుసుకున్నారు.

హెచ్ఎండిఏ ప్రాజెక్టులు, కార్యకలపాలపైన పురపాలక శాఖ మంత్రి శ్రీ కెటి రామారావు ఈరోజు బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో సంస్ద చేపడుతున్న కార్యక్రమాలు, ప్రాజెక్టుల వారిగా అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. మౌళిక వసతుల కల్పనపైన ప్రధానంగా దృష్టి సారించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. జన సామర్ధ్యం ఉన్న ప్రాంతాలను గుర్తించి రేడియల్ రోడ్లు, గ్రిడ్ రోడ్ల అభివృద్ది మరింత వేగవంతం చేయాలని కోరారు. హెచ్ఎండిఏ ఆద్వర్యంలో ఉప్పల్ ప్రాంతంలో చేపడుతున్న శిల్పరామం పనులు దసరా నాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. సంస్ధ చేపట్టిన బాట సింగారం, మంగల్ పల్లి మెదలైన లాజిస్టిక్స్ పార్కుల పురోగతిని మంత్రి సమీక్షించారు. సంస్ద పరిధిలో చెపట్టిన చెరువుల అభివృద్ది కార్యక్రమంలో భాగంగా త్వరలోనే 40 చెరువుల్లో పనుల కోసం టెండర్లను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ప్రాజెక్టుకు ఒక టైం లైన్ పెట్టుకుని పూర్తి చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. బాలనగర్ లో నిర్మాణం జరుగుతున్న ఫ్లై ఓవర్ పురోగతి పైన ప్రత్యేకంగా రివ్యూ నిర్వహించారు. నగరంలో నిర్మిస్తున్న పుట్ ఒవర్ బ్రిడ్జిల నిర్మాణాలను జీహెచ్ఎంసీతో కలసి పూర్తి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.

హెచ్ఎండిఏ పనీతీరు, ప్రాజెక్టుల అమలుపైన మంత్రి అభినందనలు తెలిపారు. విధుల్లో మంచి నైపుణ్యం ప్రదర్శించిన ఉద్యోగులను గుర్తించి వారికి ప్రొత్సాహాకాలు ఇవ్వాలని కమీషనర్ ను మంత్రి ఆదేశించారు. సామాజిక మాద్యమాల్లో సంస్ద అధికారులు మరింత ఎక్కువగా భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. ప్రజల సౌకర్యార్ధం టౌన్ ప్లానింగ్, ఇతర అనుమతులు ప్రక్రియను మరింత సులభతరం చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న అనుమతుల ప్రక్రియ ప్రభావవంతంగా పనిచేస్తున్నదని, అయితే హెచ్ఎండిఏ అనుమతులున్న లే అవుట్లలో ఇళ్ల నిర్మాణానికి సత్వరం అనుమతుల వచ్చేలా కొన్ని మార్పులను సూచించారు. నగరానికి నలుపైపుల బస్ టర్మినల్ల నిర్మాణానికి భూములను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో వారం రోజుల్లో నివేధిక తనకు అందివ్వాలన్నారు.

ఈ సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కూమార్, హెచ్ఎండిఏ కమీషనర్ చిరంజీవులు, జీహెచ్ఎంసీ అడిషనల్ కమీషనర్ భారతి హోళికేరీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.