తెలంగాణలో నూతన విమానాశ్రయాల ప్రతిపాదనలపైన సమీక్ష నిర్వహించిన మంత్రి శ్రీ కేటీఆర్.

21Jul 2018

హైదరాబాద్ విమానాశ్రయంతో పాటు ఇతర ప్రాంతాల్లో విమాన సౌకర్యాన్ని కల్పించేందుకు అవసరమైన వ్యూహాన్ని రూపొందించాలని మంత్రి శ్రీ కెటి రామారావు అధికారులను ఆదేశించారు. వరంగల్ జిల్లా మామునూరు, అదిలాబాద్, రామగుండం, జక్రాన్ పల్లి, కొత్తగూడెంలలో నూతనంగా విమానాశ్రయం ఏర్పాటుకు అవకాశాలున్నాయని తెలిపారు. ఈ ఐదు ప్రాంతాల్లో విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన సర్వేలు నిర్వహించాల్సిందిగా ఈరోజు జరిగిన సమావేశంలో అధికారులను మంత్రి ఆదేశించారు.
వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్ స్ట్రీప్ దగ్గర సుమారు 750 ఎకరాల స్థలం అందుబాటులో ఉందని దీనికి అదనంగా మరింత స్థలాన్ని సేకరించాల్సిన అవసరం ఉందని సమావేశంలో పాల్గొన్న అధికారులు మంత్రికి తెలిపారు. మిగిలిన నాలుగు చోట్ల కంటే ముందుగా వరంగల్ లో విమాన సౌకర్యాన్ని కల్పించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈనెల 27వ తేదీన వరంగల్ లో ఈ అంశం పైన సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు, ఆ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పాటు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులను కూడా ఆహ్వానించాలని మంత్రి కేటీ రామారావు ఆదేశించారు. కొత్తగూడెం లోనూ విమాన సౌకర్యాన్ని కల్పించేందుకు ఇప్పటికే పలు స్థలాలను పరిశీలించినట్లు సమావేశంలో పాల్గొన్న కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు తెలిపారు. కొత్తగూడెంలో ఏర్పాటు చేయనున్న విమానాశ్రయం కోసం ఇప్పటికే అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలతో చర్చలు చేస్తున్నామని తాజాగా గుర్తించిన స్థలం సర్వే చేయడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా మంత్రికి తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్ పల్లి దగ్గర మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్ట్ హబ్ ఏర్పాటు చేసేలా ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.

ఎంపిక చేసిన ఈ ఐదు ప్రాంతాల్లో విమాన సౌకర్యం కల్పించేందుకు అవసరమైన నిర్మాణం, ఇతర సౌకర్యాల కోసం ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాతో పాటు ఇతర సంస్థల సహకారం తీసుకుని త్వరలోనే సర్వే ప్రక్రియను ప్రారంభించాలని టీఎస్ఐఐసి అధికారులను మంత్రి ఆదేశించారు. నూతనంగా దేశంలో అందుబాటులోకి వస్తున్న సీ ప్లేన్ సౌకర్యానికి అనుకూలంగా ఉన్న రిజర్వాయర్లను గుర్తించేందుకు సాగునీటి శాఖ అధికారులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ను మంత్రి ఆదేశించారు. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకమైన ఏవియేషన్ స్ట్రాటజీని తయారు చేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ఎవియెషన్ కార్పొరేషన్ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ ప్రణాళికలో ప్రస్తుతం విమాన సౌకర్యం కల్పించాలనుకున్న ఐదు ప్రాంతాలతో పాటు, సీ ప్లేన్, హెలీ పోర్టులు అందుబాటులోకి వచ్చే ప్రాంతాలతో రాష్ట్రంలో ఉన్న ప్రముఖ విహార, ఆధ్యాత్మిక కేంద్రాలను అనుసంధానించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఉడాన్ స్కీంలో ఉన్న సౌకర్యాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా కార్పొరేషన్ అధికారులకు మంత్రి సూచనలు చేశారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ తోపాటు, టిఎస్ఐఐసి అధికారులు,  రాష్ట్ర ఏవియేషన్ కార్పొరేషన్ ఎండి భరత్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.