We will completely support the family of Sai Krishna who was shot in USA : KTR

8Jan 2019

అమెరికాలో కాల్పుల సంఘటనలో గాయపడ్డ సాయికృష్ణకు అండగా ఉంటాం: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అమెరికాలో దుండగుల చేతిలో కాల్పుల సంఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న మహబూబాబాద్ కు చెందిన విద్యార్థి సాయికృష్ణకు పూర్తి అండగా ఉంటామని కేటీ రామారావు తెలిపారు. సాయికృష్ణ కుటుంబ సభ్యులు ఈరోజు బేగంపేట క్యాంపు కార్యాలయంలో కేటిఆర్ గారిని కలిసి ప్రభుత్వ సహకారాన్ని కోరారు. సాయికృష్ణ తల్లిదండ్రులు వెంటనే అమెరికాకి వెళ్లేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు. ప్రస్తుతం సాయికృష్ణ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారని అయితే పలు శస్త్ర చికిత్సలు ఆయనకు అవసరమని అక్కడ ఉన్న సాయికృష్ణ మిత్రులు తమకు తెలియజేశారని తల్లిదండ్రులు కేటీఆర్ గారికి తెలిపారు.

అవసరమైతే మరింత సహకారం కోసం కేంద్ర ప్రభుత్వం విదేశీ వ్యవహారాల శాఖ తరఫున సహాయం కోసం విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ గారితో మాట్లాడుతామని సాయికృష్ణ కుటుంబ సభ్యులకు కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ మేరకు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు సీతారాం నాయక్ నేరుగా సుష్మాస్వరాజ్ గారిని నిన్న కలిసినట్లు కేటీఆర్ తెలిపారు.

కుటుంబ సభ్యులు అమెరికా వెళ్లేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని తక్షణం అందించాలని ముఖ్యమంత్రి కార్యాలయ స్పెషల్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. సాయి కృష్ణ కుటుంబ సభ్యులు అమెరికా వెళ్లేందుకు అవసరమైన అత్యవసర వీసాలను జారీ చేయాల్సిందిగా హైదరాబాద్ లోని అమెరికా కాన్సుల్ జర్నల్ కేథరిన్ హెడ్డా తోనూ కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. కష్ట కాలంలో తమ కుటుంబానికి ఆసరాగా నిలబడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి సాయి కృష్ణ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

Image may contain: 2 people, people sitting, people standing and indoor